ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇవాళ ఢిల్లీ ప్రజలకు లార్డ్ హనుమాన్ దీవెనలు అందించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు సరైన మార్గాన్ని చూపాలని హనుమాన్ను కేజ్రీవాల్ కోరుకున్నారు.
ఢిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి. విద్యుత్, నీటి సరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం చేసిన కృషికి ప్రజలు మళ్లీ మమ్మల్ని ఆదరించారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదామని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 7 స్థానాలకే పరిమితం కాగా..కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.